మైనర్ బాలిక అత్యాచారం కేసులో పాస్టర్ అరెస్టు

  • ఏలూరు జిల్లాలో ఘటన
  • నిందితుడైన పాస్టర్ రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
  • గర్భస్రావం మాత్రలతో బాలికకు తీవ్ర రక్తస్రావం
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
  • విషయాన్ని సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై చౌటపల్లి రాంబాబు (42) అనే పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గర్భం దాల్చిన బాలికకు నిందితుడు గర్భస్రావం మాత్రలు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి, విషయం బయటపడింది. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో రాంబాబు ఓ చర్చిని నిర్వహిస్తున్నాడు. కూలి పనులు చేసుకునే బాధితురాలి కుటుంబం కొంతకాలంగా ఈ చర్చికి వెళ్తోంది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన పాస్టర్, ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో బాలిక భయంతో మౌనంగా ఉండిపోయింది.

ఇటీవల బాలికకు నెలసరి రాకపోవడంతో గర్భం దాల్చిందని అనుమానించి, నిందితుడు ఆమెకు అధిక మోతాదులో గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. దీనివల్ల బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సమక్షంలో బాధితురాలు అసలు విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తాడికలపూడి పోలీసులు నిందితుడు రాంబాబును శనివారం అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ ఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) సుమోటోగా స్వీకరించింది. కమిషన్ ఛైర్మన్, సభ్యులు సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
 

Choutapalli Rambabu
Eluru
Andhra Pradesh
minor girl
rape case
pastor arrested
POCSO Act
abortion pills
APSCPCR
sexual assault

More Telugu News